
ఫిబ్రవరి 21 మాతృభాషాదినోత్సవం జరుపుకొన్నాం. తల్లి వంటి తెలుగును... తేనెలూరు తెలుగును మరిచిపోతున్నామని మరోసారి గుర్తుచేసుకున్నాం. అంతా మరిచిపోయి పనిలో పడిపోయాం. కొన్నేళ్లుగా ఇదే తంతు సాగుతోంది. దీన్నంతా నిశ్శబ్దంగా గమనిస్తున్న ఒక అరవయ్యేళ్ల వ్యక్తి మాత్రం తెలుగు నేర్పడానికి సులువైన పద్ధతులను రూపొందించుకుని కృషి చేస్తున్నారు.
హైదరాబాద్లో నివసిస్తున్న షేక్ బడేసాహెబ్ గడచిన ఇరవయ్యేళ్లలో దాదాపు మూడు వేలమంది తెలుగు ఉపాధ్యాయులకు 'తెలుగెలా నేర్పాలి?' అంటూ ప్రత్యేకంగా బోధించారని తెలిసినప్పుడు ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. అంతేకాదు... ఎందరో విదేశీయులకు ఇరవై రోజుల్లో తెలుగు నేర్పించి వారితో శభాష్ అనిపించుకున్నారు.
ఇంత చేస్తున్న బడేసాహెబ్ ఉపాధ్యాుడేం కాదు, ఏ కాలేజీలోనో లెక్చరర్ అంతకన్నా కాదు. మచిలీపట్నంలో పుట్టిపెరిగిన ఆయన తపాలాశాఖ ఉద్యోగి. డిగ్రీ వరకే చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువగా చదవడం, తెలుగుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టడం తప్ప తెలుగు నేర్పడానికి ఆయనకంటూ ప్రత్యేక అర్హతలు లేవనే చెప్పుకోవాలి.
ఒకపక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తెలుగుభాషను సులభంగా ఎలా నేర్చుకోవాలి అనే అంశంపై పరిశోధన చేశారు. ఎన్నో పుస్తకాలు చదివారు, ఎందరినో కలిశారు. వాటి సారాంశాన్ని కూర్చి తన తల్లి పేరిట 'మాఁ హసన్బీ తెలుగు వాచకం' అంటూ 45 పేజీల నిడివి గల ఒక తెలుగు వాచకాన్ని తయారుచేశారు.
అవరించిందిలా....
తెలుగు కోసం బడేసాహెబ్ చేస్తున్న కృషి వెనుక చాలా పెద్ద కథే ఉంది. 1991 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఆ ఏడాదిని 'అక్షరాస్యత సంవత్సరంగా' ప్రకటించింది. అప్పటి నివేదికల ప్రకారం ప్రపంచంలో ఒక్క భారత ఉపఖండంలోే యాభైశాతం నిరక్షరాస్యులున్నారని తేలింది. ఇది వెలుగులోనికి వచ్చినప్పుడు చాలామంది స్పందించారు.
నిరక్షరాస్యత నిర్మూలనకు పెద్ద పెద్ద ప్రణాళికలే వేశారు. కార్యాచరణలోనికి రానివి కొన్ని.సత్ఫలితాలనివ్వనివి కొన్ని. "ఆ సమయంలో నావంతు కృషి నేను చేయాలని అనుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి మనిషీ కనీసం వాడి మాతృభాషని చదవడం రాయడం నేర్చుకుంటే చాలనిపించింది. ఆ దిశగా అడుగులు వేశాను'' అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నారు బడేసాహెబ్.
తెలుగు సులువు..అన్ని భాషల్లోకెల్లా తెలుగుభాషని నేర్చుకోవడం చాలా కష్టమని చాలామంది అభిప్రాయం. బడేసాహెబ్ మాత్రం ఈ అభిప్రాయంతో ఏకీభవించరు. పుస్తకాల్లో తెలుగును సంక్లిష్టంగా చూపించడం వల్లే అలాంటి అభిప్రాయం ఏర్పడిందిగానీ కొన్ని మెళకువలు పాటిస్తే ఎంతో సులువుగా తెలుగు భాషను నేర్చుకోవచ్చని అంటారు. ఇక్కడ పుట్టిన పిల్లలకే కాదు, విదేశీయులకు సైతం ఎన్నో సులభంగా నేర్పించవచ్చంటున్నారు బడే సాహెబ్.
ఇరవైరోజుల్లో....
మన దేశ భాషలను నేర్చుకోడానికి విదేశాల్లో పుస్తకాలు ఉన్నాయి. అయితే అవేవీ రెండువందల పేజీలకు తక్కువ ఉండవు. పైగా వాటి ద్వారా నేర్చుకోవడానికి ఆర్నెల్లో ఏడాదో సమయం పడుతుంది. బడేసాహెబ్ మాత్రం ఇరవైరోజుల్లో విదేశీయులకు తెలుగు నేర్పారు. ఇదెలా సాధ్యమయిందంటే 'నా పుస్తకం ప్రత్యేకత అదే మరి' అంటారు.
1997లో తెలుగు వ్యాకరణం మీద పరిశోధన చేయడానికి డేవిడ్ కాలిన్స్, అండ్రీ కాలిన్స్ అనే ఇద్దరు అమెరికన్లు మన రాష్ట్రం వచ్చినపుడు తెలుగు నేర్చుకోడానికి బడేసాహెబ్ని సంప్రదించారు. రోజుకి రెండు గంటల చొప్పున ఇరవై రోజుల్లో వారికి తెలుగు రాయడం, చదవడం కూడా నేర్పించారు. ఆ తరువాత చాలా మంది విదేశీయులకు ఆయన తెలుగు నేర్పించారు. దాంతో ఆయన కృషికి గుర్తింపు పెరిగింది.
పాఠశాలల్లో తెలుగు వెలుగు...
పూర్తిగా తెలుగు తెలియనివారికి దాన్ని నేర్పడం ఒకెత్తు. విద్యార్థులకు తెలుగు నేర్పడం అనేది మరొకెత్తు. దీనికోసం ఆయన చాలా పాఠశాలలు తిరిగారు. "ఒక స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలకి కొన్ని తెలుగు పదాలు చెప్పి రాయమంటే...ఒక్కరు కూడా నాలుగు పదాలు తప్పులేకుండా రాయలేకపోయారు. తప్పు విద్యార్థులది కాదు.
పాఠ్యపుస్తకాల్లో తెలుగుని అంత కఠినంగా చూపిస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా సులభ పద్ధతిలో బోధించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుని ఒక భూతంలా చూపిస్తున్నారు. దాంతో నేను ముందు టీచర్లకే కొన్ని విషయాలు బోధించాలనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాదాపు మూడువేల మంది తెలుగుటీచర్లకు నేను క్లాసులు చెప్పాను'' అంటూ వివరించారు.
మాటలకే పరిమితమైంది...
మన మాతృభాషకి గుర్తింపు ఇవ్వడం అంటే దాన్ని మనం నేర్చుకోవడమే - అంటారు బడేసాహెబ్. ఈ ఇంగ్లీషు ప్రపంచంలో మన మాతృభాష రాయడం, చదవడం రాకపోతే నష్టమేంటి అనుకునే హైటెక్మనుషులకు ఆయన ఒక రహస్యం చెబుతున్నారు. "మాతృభాష వస్తేనే పరాయి భాషపై పట్టువస్తుంది. ఏ మనిషైనా తన మనసులోని భావాన్ని మాతృభాషలో చెప్పినంత స్పష్టంగా మరే ఇతర భాషలోనూ చెప్పలేడు. అందుకే అమ్మ పాల కమ్మదనం అనుభవిస్తున్నప్పటి నుంచే మాతృభాషనూ నేర్చుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి..'' అంటారాయన.
ఇతరబాషలు కూడా...
అతి తక్కువ సమయంలో తెలుగుభాషని నేర్పించడంలో విజయం సాధించిన సాహెబ్ ప్రస్తుతం ఒక పుస్తకాల దుకాణం పెట్టుకున్నారు. ఆయన రాసిన తెలుగు పుస్తకాన్ని ఎవరైనా ప్రచురిస్తారేమోనని పది సంవత్సరాల పాటు ఎందరో పెద్దల చుట్టూ తిరిగారు. ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తానే స్వయంగా ఆ పుస్తకం ముద్రణ బాధ్యత నెత్తికెత్తుకున్నారు. బడేసాహెబ్ అడుగులు ఇక్కడితో ఆగిపోలేదు. హిందీ, ఇంగ్లీషులపై కూడా ఆయన పరిశోధన మొదలైంది. ఆయన పరిశోధన ఫలాలను అందుకోవడమే మనం చెయ్యాల్సింది
ఫిబ్రవరి 21
0 commentsPosted by Telugu at 3:17 AM
Subscribe to:
Posts (Atom)
www.e-telugu.com || mailto: info@e-telugu.com